బీజేపీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని, కానీ మతపరమైన రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నల్లగొండ జిల్లాను సందర్శించిన ఆయన, స్థానిక బీజేపీ కార్యకర్తల సమ్మేళనం అనంతరం మీడియాతో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే బీజేపీ ఉద్దేశమని, ఆ రిజర్వేషన్లలో మతపరమైన కోటా పేరుతో 10 శాతం ముస్లింలకు ఇవ్వడాన్ని బీజేపీ ఒప్పుకోదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించిందని గుర్తుచేశారు. “ఇలాంటి మతపరమైన రిజర్వేషన్ల వల్ల అసలైన బీసీలకు నష్టం జరుగుతుంది. రాష్ట్ర బీసీలు ఈ వాస్తవాన్ని గుర్తించాలి” అని ఆయన అన్నారు.
ఇకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం తన కార్యకర్తలకు ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో రేషన్కార్డులు పంపిణీ చేస్తోందని, ఇప్పటికే దళారులు రంగంలోకి దిగారని రాంచందర్రావు ఆరోపించారు. నల్లగొండ గడ్డపై కుటుంబ పాలనను అంతమొందించాల్సిన అవసరం ఉందని, ప్రజలతో బీజేపీ నాయకులు నడిచిపోతూ కాంగ్రెస్ అవినీతిని ఎత్తిచూపాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని, వాటిపై బీజేపీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే సాధ్యమవుతుందన్నది ఆయన అభిప్రాయం.




