భారతరత్న, కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రతిష్టాత్మక చిత్రం సిద్ధమవుతోంది. భారతీయ సంగీత ప్రపంచంపై చెరగని ముద్ర వేసిన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి జీవితం, కళా ప్రస్థానం, అరుదైన ఘట్టాలను నేటి తరానికి పరిచయం చేసేలా ఈ బయోపిక్ను రూపొందించనున్నారు.గీతా ఆర్ట్స్, రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్, బీవీ వర్క్స్ పతాకాలపై అల్లు అరవింద్, రాక్లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్రను పోషించనున్నారు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఎం.ఎస్. సుబ్బలక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో చిత్రబృందం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 16, 2026న చెన్నైలోని ప్రతిష్టాత్మక ‘ది మ్యూజిక్ అకాడమీ’ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సినీ, సంగీత రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్కు లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఆలపించిన ఐకానిక్ గీతాలను ఇండియన్ కోరల్ ఎన్సెంబుల్ బృందం లైవ్గా ప్రదర్శించనుంది. దీంతో సినిమా ప్రారంభోత్సవ వేడుకకు సంగీత ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఈ కార్యక్రమానికి ‘ఎంఎస్ బ్లూ’ రంగు దుస్తులను డ్రెస్ కోడ్గా నిర్ణయించడం కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి సంగీత వారసత్వాన్ని గుర్తు చేసేలా ఈ కార్యక్రమాన్ని సంగీతం, సంస్కృతి, కళాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.సాంకేతికంగా కూడా ఈ సినిమాను అత్యున్నత స్థాయిలో రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి సంగీత ప్రస్థానానికి అనుగుణంగా ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
కేవలం ఒక ప్రముఖ వ్యక్తి జీవితకథను తెరపై చూపించడమే కాకుండా.. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి కళా ప్రస్థానం, సంగీత సాధన, వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన గౌరవాన్ని ఈ బయోపిక్లో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు రష్మిక మందన్న తొలిసారి ఇలాంటి ప్రతిష్టాత్మక బయోపిక్లో కీలకమైన పాత్రను పోషిస్తుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకుడు ఈ కథను తెరకెక్కించనుండటంతో సినిమా ఎలా ఉండబోతుందనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


