తెలంగాణ శాసనసభ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహా పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించారన్న ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులు నమోదు చేశారు.
ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎం. బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు సమాచారం. కేటీఆర్, హరీశ్రావుతో పాటు ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, జగదీశ్రెడ్డి, శంభీపూర్ రాజు, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి తదితరుల పేర్లు కేసులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల ఫిర్యాదు ప్రకారం.. అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన భద్రతా కార్డన్ను దాటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసు సిబ్బందితో బీఆర్ఎస్ నేతలకు ఘర్షణాత్మక పరిస్థితి ఏర్పడింది. విధుల్లో ఉన్న పోలీసులను నెట్టివేయడం, దుర్భాషలాడటం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఆరోపణలు కేసులో ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్, మీడియా విజువల్స్ను పోలీసులు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
సోమవారం బీఆర్ఎస్ నేతలు నల్ల టీషర్టులు ధరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్రావు సహా పలువురు నేతలను పోలీసులు కొంతసేపు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ చర్యలు చేపట్టారు. వారిపై భారతీయ న్యాయ సంహితతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్లను ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు.
తాతా మధును న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించగా, నవీన్ కుమార్ రెడ్డిని కూడా ఆయన నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పీకర్ను ఉద్దేశించి అభ్యంతరకర, అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఈ కేసులు నమోదయ్యాయి. కేసులో వీడియో రికార్డులు, మీడియా ప్రసారాలను కూడా ఆధారాలుగా పరిశీలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అయితే తాతా మధు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలు స్పీకర్ను ఉద్దేశించినవి కాదని, వాటిని రాజకీయంగా వక్రీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు స్పీకర్ను ఉద్దేశించినట్లుగా భావిస్తే వాటిని ఉపసంహరించుకుని విచారం వ్యక్తం చేస్తానని తెలిపారు.




