సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్, సినిమాలోని ముద్దు సన్నివేశంపై వస్తున్న విమర్శలకు నిర్మాత నాగవంశీ గట్టిగా బదులిచ్చారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య మధ్య ఉన్న కిస్ సీన్పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘90స్’ లాంటి క్లీన్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ తీసిన దర్శకుడు ఆదిత్య ఇలాంటి సినిమా ఎలా తీశారంటూ వస్తున్న విమర్శలను నాగవంశీ కొట్టిపారేశారు.తాజాగా జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ ఈ అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవెంట్కు వచ్చిన కొందరు ప్రేక్షకులను పిలిచి వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ట్రైలర్లో ఒక్క ముద్దు సన్నివేశం ఉన్నంత మాత్రాన సినిమా అడల్ట్ మూవీ అయిపోదని ఆయన స్పష్టం చేశారు. ఇది ఫ్యామిలీతో కలిసి చూడగలిగే స్వచ్ఛమైన ప్రేమకథ అని పేర్కొన్నారు.
ఈ సినిమాలో కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఒక ప్రయోగం చేసినట్లు నాగవంశీ వెల్లడించారు. మొత్తం 2 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో దాదాపు గంటా 40 నిమిషాల పాటు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య సంభాషణలే ఉంటాయని తెలిపారు. ఇద్దరి మధ్య సంబంధం, భావోద్వేగాలు, ప్రేమలో ఎదురయ్యే ప్రాక్టికల్ సమస్యలను ప్రధానంగా చూపించినట్లు వివరించారు.నిజామాబాద్, వనపర్తి వంటి రూరల్ ప్రాంతాల నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్ లేని ఓ యువకుడిని, ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న ఓ అమ్మాయి తన ప్రేమతో ఎలా మార్చింది? అతనిలోని అభద్రతాభావాన్ని ఎలా తొలగించింది? అనే అంశాలను దర్శకుడు ఆదిత్య చాలా సహజంగా తెరకెక్కించారని నాగవంశీ తెలిపారు.
సాధారణ ఫ్యామిలీ సినిమాల్లో కనిపించే రొటీన్ సమస్యలకు భిన్నంగా ఈ సినిమాలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఎదురయ్యే ప్రాక్టికల్ సమస్యలను చూపించినట్లు ఆయన చెప్పారు. ప్రేక్షకులు తమ జీవితాల్లో ఎదుర్కొనే పరిస్థితులకు దగ్గరగా కథ ఉంటుందని పేర్కొన్నారు.సినిమాను ఎవరి వెంట వెళ్లి చూడాలనే విషయంపై కూడా నాగవంశీ సరదాగా స్పందించారు. గర్ల్ఫ్రెండ్, భార్య లేదా తల్లితో కలిసి కూడా సినిమాను నిర్భయంగా చూడవచ్చని అన్నారు. అంతేకాకుండా డబ్బులున్న గర్ల్ఫ్రెండ్ ఉంటే సినిమాను మరింత ఎంజాయ్ చేస్తారని సరదాగా వ్యాఖ్యానించారు.దర్శకుడి జానర్ ఎంపికపై వస్తున్న విమర్శలపైనా నాగవంశీ స్పందించారు. ఒక దర్శకుడు తన టాలెంట్ను బట్టి ఏ జానర్లోనైనా సినిమా చేయవచ్చని అన్నారు. గతంలో క్లీన్ ఫ్యామిలీ కంటెంట్ చేసిన దర్శకుడు ఇప్పుడు రొమాంటిక్ కథను తెరకెక్కించడంలో తప్పేమీ లేదని పేర్కొన్నారు.తాను నిర్మాతగా కాకుండా ప్రేక్షకుడిగా సినిమాను చూస్తే రామ్-కామ్ అంటే తనకు ఎంతో ఇష్టమని నాగవంశీ చెప్పారు. ఈ సినిమాలోని ఫస్ట్ హాఫ్లో ‘ఏ మాయ చేశావే’ తరహా ఫీల్ కచ్చితంగా కనిపిస్తుందని తెలిపారు.సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలని నాగవంశీ ఆసక్తి వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం సినిమా చూసిన తర్వాత ట్విట్టర్లో తనకు జెన్యూన్ రివ్యూలు చెప్పాలని ప్రేక్షకులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.


