టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ కూడా దూసుకుపోతోంది. తాజాగా అన్ స్టాపబుల్-2 లేటెస్ట్ ఎపిసోడ్ కు తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజాలు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, డి.సురేశ్ బాబు విచ్చేశారు.  

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, సురేశ్ బాబుతో నా అనుంబంధం తెలిసిందే. కానీ మనిద్దరి కాంబినేషనే బ్యాలన్స్ ఉంది అంటూ అల్లు అరవింద్ తో చెప్పారు. అందుకు అల్లు అరవింద్ మరింత ఆసక్తికరంగా స్పందించారు. మిమ్మల్ని, చిరంజీవిని పెట్టి ఓ సినిమా తీయాలనుందని బాలకృష్ణతో అన్నారు. దాంతో బాలయ్య... అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందంటూ వ్యాఖ్యానించారు. సాయంత్రాలు మందు పార్టీలకు సంబంధించి... అరవింద్ తో బాకీ ఉందని సురేశ్ బాబు చమత్కరించగా, ఈయన బాగా వెజిటేరియన్ అంటూ అరవింద్ అదేస్థాయిలో బదులిచ్చారు.  

ఇక, మీరు (అరవింద్) బన్నీతో, మీరు (సురేశ్ బాబు) వెంకీతో ఎలా వేగుతున్నారు అంటూ బాలయ్య సరదాగా ప్రశ్నించారు. చెప్పుకోని కష్టాలు ఉంటాయండీ అంటూ అరవింద్ నవ్వేశారు. మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ ను కూడా బాలకృష్ణ తనదైన శైలిలో రక్తి కట్టించారు. అనంతరం రాఘవేంద్రరావు కూడా షోలోకి ఎంటరవడంతో నవ్వులు మరింత విరబూశాయి. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా ఓటీటీ నేడు విడుదల చేసింది. ఈ భారీ ప్రోమో 4 నిమిషాలకు పైగా ఉంది. అభిమానులను అలరించే అనేక అంశాలు ఈ ప్రోమోలో చూడొచ్చు.