విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా కళాశాలల్లో అమలు చేస్తున్న సెమిస్టర్ విధానాన్ని పాఠశాలల్లోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం అమలుపై ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.  

2023-24 విద్యాసంవత్సరం నుంచి సెమిస్టర్ విధానాన్ని వర్తింపజేయాలని సీఎం జగన్ ఆదేశించారు. తొలుత 1 నుంచి 9వ తరగతి వరకు సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచి 10వ తరగతిలోనూ సెమిస్టర్ విధానం ప్రవేశపెడతారు. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెమిస్టర్ విధానానికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలను కూడా రూపొందించనున్నారు.