బిజెపి బిఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోవాలా అందుకోసమే ప్రభుత్వ సుస్థిరత కోసం ఎమ్మెల్యేల చేరికలు చేపట్టామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ వన మహోత్సవంలో పాల్గొని మంత్రి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ దేశంలో ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో అందరికీ తెలుసని, బండి సంజయ్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేశాయని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్​లోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేసిన వారే ధర్మం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చినప్పుడు ఎంత మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారో బండి సంజయ్ చెప్పాలని పొన్నం సవాల్ విసిరారు. డిసెంబర్ 3 వరకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచనే తమ ప్రభుత్వానికి లేదని పొన్నం పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని అంటుంటే, నిలబెట్టడానికి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యులు వస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని కూలుస్తామని అటు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అని ప్రశ్నించారు. తాము ధర్మం తప్పడం లేదని, రాజనీతి చేస్తున్నామని పొన్నం స్పష్టం చేశారు. కులగణనపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి

భవిష్యత్తు తరాన్ని కాపాడుకునేందుకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

సోమవారం కొత్తపల్లి మండలం చింతకుంటలోని శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన 75 వనమహోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. వన మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నదని తెలిపారు. ఒకప్పుడు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సంజయ్ గాంధీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్తు తరాన్ని కాపాడు కునేందుకు, పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు తప్పనిసరిగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఆరు మొక్కలు విధిగా నాటాలని, వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల్లో అవసరమైన పూలు, పండ్ల మొక్కలను అధికారులు అందిస్తారని తెలిపారు. ప్రజల సహకారంతోనే మొక్కల సంరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. యూనివర్సిటీ నిర్మాణం సందర్భంగా ఇన్ని మొక్కలు కనిపించలేదని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ హయంలో యూనివర్సిటీ శంకుస్థాపన జరిగిందని తెలిపారు. అప్పుడు తాను మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఉన్నానని పేర్కొన్నారు. 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ కేటాయించడం జరిగిందని తెలిపారు. అప్పుడు కేసిరెడ్డితో పాటు అధికారులను తీసుకొచ్చి స్థల సేకరణతో పాటు యూనివర్సిటీ నిర్మాణానికి కృషి చేశామని పేర్కొన్నారు. యూనివర్సిటీలో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటేందుకు అధికారులు, విద్యార్థులు, సిబ్బంది కృషి చేయాలని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. 

కరీంనగర్ జిల్లాలో 43 లక్షల మొక్కల పెంపకానికి ప్రభుత్వం లక్ష్యం

 వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజలు అందరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా ప్రజలు తమ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి మొక్కకు అధికారులు జియో టాకింగ్ చేయాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే మొక్కలే నాటాలని, ఈ అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఆక్సిజన్, నీడ, పండ్లు పూలు అందించే మొక్కలు నాటాలని సూచించారు. తల్లి పేరు మీద, కుటుంబ సభ్యుల పేరు మీద, ఇష్టం వచ్చినవారు పేర్ల మీద మొక్కలు నాటవచ్చని పేర్కొన్నారు. మొక్కలను సంరక్షించే బాధ్యతను అందరు తీసుకోవాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, శాతవాహన యూనివర్సిటీ రిజిస్టర్ వరప్రసాద్, ఆర్డీఓ కే మహేశ్వర్, డీఆర్డిఓ శ్రీధర్, డిఎఫ్ఓ బాలమణి, తహసిల్దార్ రాజేష్, ఎంపీడీవో ప్రభు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.