దేశం మొత్తం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్న వేళ తెలంగాణ ఆర్టీసీ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 15న పుట్టిన చిన్నారులందరికీ వారికి 12 సంవత్సరాలు వచ్చే వరకు అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులకు ఆగస్టు 15న ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొంది. అంతేకాదు, రూ.120 టీ24 బస్‌ టికెట్‌ను ఆగస్టు 15న రూ.75కే విక్రయించనున్నట్టు వివరించింది.  

అలాగే, ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నేటి నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లోనూ రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించనున్నట్టు తెలిపింది. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయనుంది. ఉద్యోగులందరూ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ బ్యాడ్జీలతోనే విధులకు హాజరవుతారు. వీటితోపాటు మరిన్ని ఆఫర్లను కూడా టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు