ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి నివాసంలో పునరుద్ధరణ పనులలో భాగంగా నిర్మించిన రిటైన్ వాల్ క్రమబద్ధీకరణకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025 జూన్ 5న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)కి చిరంజీవి దరఖాస్తు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ సందర్భంగా చిరంజీవి తరఫు న్యాయవాది వాదిస్తూ, 2002లోనే G+2 నిర్మాణానికి అనుమతులు పొందామని, ప్రస్తుతం జరుగుతున్న పునరుద్ధరణ పనులు పూర్తిగా చట్టబద్ధమైన ప్రక్రియలో భాగమేనని కోర్టుకు వివరించారు. అయితే, GHMC స్పందించకపోవడం కారణంగా కోర్టు ఆశ్రయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఇక GHMC తరఫు న్యాయవాది స్పందిస్తూ, చిరంజీవి దరఖాస్తుపై త్వరలో చట్టపరమైన ప్రక్రియ ప్రారంభిస్తామని న్యాయస్థానానికి హామీ ఇచ్చారు.
అన్ని వాదనలు పరిశీలించిన ధర్మాసనం, GHMC చట్టబద్ధంగా నిర్ణయం తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. దీంతో చిరంజీవి ఇంటికి సంబంధించిన నిర్మాణ పనుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఊతం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై GHMC తీసుకునే నిర్ణయాలు ప్రస్తుత చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.




