తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం, నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రాన్ని వికసిత తెలంగాణగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన మెదక్ జిల్లా పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ సందర్భంగా మెదక్ జిల్లాలో ఆయనకు డప్పు మేళాలతో, గజమాలలతో, భారీ ర్యాలీల మధ్య ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆయన పర్యటనను విజయవంతం చేశారు. పర్యటనలో రాష్ట్ర అధ్యక్షుడిని బ్రహ్మరథం పట్టిన దృశ్యాలు ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.
పర్యటన అనంతరం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాంచందర్ రావు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలంటే శ్రద్ధ, క్రమశిక్షణ, జనాన్ని చేరుకునే కార్యాచరణ అవసరమని ఆయన హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ రావు, ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి, ఇతర జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. పార్టీ గెలుపు కోసం అందరూ ఒకే దారిలో పయనించాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు.




