బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను భారతీయ జనతా పార్టీలో చేర్చుకునే ప్రశ్నే లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు స్పష్టంచేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తమ పార్టీలో ఎలాంటి స్థానం ఉండదని ఆయన ఖండితంగా తేల్చిచెప్పారు.గుండ్రాంపల్లిలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. అనంతరం మాట్లాడిన రాంచందర్రావు, “కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతోనే బీఆర్ఎస్ పతనం మొదలైంది. త్వరలోనే ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు కూడా కారు దిగిపోవడం ఖాయం” అని జోస్యం చెప్పారు.కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. “దోచుకున్న సొమ్ము పంపకాల విషయంలోనే కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. వారి కుటుంబ పంచాయితీ ఇప్పుడు రోడ్డుపైకి వచ్చేసింది. కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ అవినీతి బట్టబయలైంది” అని ఆరోపించారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆయన ఆక్షేపించారు. “కాళేశ్వరం అవినీతి కేసుపై విచారణను 20 నెలలుగా ఆలస్యం చేస్తోంది. నిందితులు ఆధారాలు తారుమారు చేసుకునే అవకాశం లభించింది. ఇది బీఆర్ఎస్–కాంగ్రెస్ పరస్పర రక్షణలో భాగమే” అని విమర్శించారు. ఈ కేసును ముందుగానే సీబీఐకి అప్పగించి ఉంటే నిజాలు బయటపడేవని వ్యాఖ్యానించారు.
సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా ఎందుకు నిర్వహించడం లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఘనంగా నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు “తెలంగాణ పరిపాలన దినోత్సవం” అంటూ ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. నిజాం వారసుల పార్టీ ఎంఐఎంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ సఖ్యత కొనసాగిస్తున్నాయని దుయ్యబట్టారు.ఇదే సమయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు స్పందించారు. “హరీశ్రావు, సంతోష్ పాత్ర ఉందని కవిత ఆరోపించిన నేపథ్యంలో, ఆమె వద్ద ఉన్న ఆధారాలను వెంటనే సీబీఐకి అందజేయాలి” అని ఆయన సూచించారు.




