పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడింది. ఈ నెల 8న తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ క్రీడా మైదానంలో ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో, అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి ఈ ఈవెంట్ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వేడుకకు సంబంధించిన కొత్త తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా, సినిమా విడుదల కూడా వాయిదా పడనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, జ్యోతి కృష్ణ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 12న సినిమా విడుదల కావాల్సి ఉన్నా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని ఆగిపెట్టే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం.
ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదాపై మాత్రం అధికారిక ప్రకటన వెలువడగా, సినిమా విడుదల తేదీ మార్పుపై స్పష్టత ఇంకా రాలేదు. అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో చిత్ర బృందం వెల్లడించనున్నది.
హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ వేడుక వాయిదా
