తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్. రామ్చందర్ రావు ఎంపిక అయ్యారు. కేంద్ర నాయకత్వం ఆదేశాలతో ఈ నియామక ప్రక్రియ కొనసాగగా సోమవారం నాటికి ఒక్క నామినేషన్ మాత్రమే వచ్చిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో రామచందర్ రావుకు అధ్యక్ష పదవి ఖరారైంది.
రామ్చందర్ రావు ఒక సీనియర్ న్యాయవాది కావడంతోపాటు, 2015 నుండి 2021 వరకూ శాసనమండలి సభ్యుడిగా (ఎంఎల్సీ) సేవలు అందించారు. అంతకుముందు హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయనకు పార్టీ కార్యకలాపాలపై మంచి అనుభవం, ఆధికారం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఇప్పటివరకు ఉన్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్థానాన్ని ఇప్పుడు రామ్చందర్ రావు భర్తీ చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించేందుకు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు కేంద్ర బీజేపీ ఈ మార్పును తీసుకువచ్చిందని విశ్లేషకుల అభిప్రాయం.




