తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హైకోర్టులో ఊరట పొందారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 2016లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
సొసైటీ స్థలాన్ని అక్రమించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మయ్యపై అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసును చట్టబద్ధంగా కొట్టివేయాలంటూ 2020లో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఇటీవల విచారణ ముగిసిన ఈ కేసులో, జూన్ 20న వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలపై తగిన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.
అంతేకాక, ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి సంఘటనా స్థలంలో లేరని స్పష్టంగా తేలిందని హైకోర్టు వెల్లడించింది. అందువల్ల ఈ కేసులో కొనసాగింపు అవసరం లేదని భావించిన కోర్టు, కేసును పూర్తిగా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ తీర్పుతో రేవంత్ రెడ్డికు కీలకమైన న్యాయపరమైన ఊరట లభించినట్లైంది.




