వ్యాపారం - కళలలో ప్రపంచవ్యాప్తంగా ప్ర‌భావం చూపిన టాప్ 50 భారతీయుల జాబితాను ప్ర‌ఖ్యాత బిజినెస్ స్టాండార్డ్ ప‌త్రిక ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌చురించింది. ఈ ప్ర‌చుర‌ణ‌లో క‌ళారంగం నుంచి స‌త్య‌జిత్ రే, AR రెహమాన్, తన్వీ షా, ర‌సూల్ పోకుట్టి, గుల్జార్, శంక‌ర మ‌హ‌దేవ‌న్ స‌హా ప‌లువురు దిగ్గ‌జాల పేర్ల‌ను వెల్ల‌డించింది. ప్రపంచాన్ని కదిలించిన 50 మంది భారతీయుల జాబితాలో టాలీవుడ్ ప్ర‌ముఖులు చంద్ర‌బోస్ - ఎం.ఎం.కీర‌వాణి, త‌మ స్థానాన్ని ప‌దిల‌ప‌రుచుకున్నారు. టాప్ 50లో 33వ స్థానంలో ఏ.ఆర్.రెహ‌మాన్ గౌర‌వం ద‌క్కించుకోగా, 35వ స్థానం కీర‌వాణి-చంద్ర‌బోస్‌ల‌కు ద‌క్కింది.

1992లో అకాడెమీ అవార్డుల‌లో జీవిత‌కాల సాఫ‌ల్య పుర‌స్కారాన్ని (లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్) అందుకున్న మేటి భార‌తీయ ఫిలింమేక‌ర్ గా స‌త్య‌జిత్ రేకి గొప్ప గుర్తింపు ఉంది. త‌న‌దైన ప్ర‌తిభ‌తో ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు ద‌క్కేలా భార‌తీయ‌ సినిమాకు ఆయ‌న అసాధార‌ణ‌ సేవలు అందించాని బిజినెస్ స్టాండార్డ్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. ఇక ఇదే జాబితాలో మొజార్ట్ ఆఫ్ మ‌ద్రాస్`గా సుప్ర‌సిద్ధుడైన ఏ.ఆర్.రెహ‌మాన్ కూడా `స్ల‌మ్‌డాగ్ మిలియ‌నీర్ తో సంగీతం విభాగంలో రెండు ఆస్కార్ లు గెలుచుకుని గ్లోబ‌ల్ సినిమాలో స‌త్తా చాటార‌ని వ్యాఖ్యానించింది.

అలాంటి గొప్ప ప్ర‌తిభావంతుల‌కు చోటు ద‌క్కిన జాబితాలోమేటి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి- సీనియ‌ర్ లిరిసిస్ట్ చంద్ర‌బోస్ పేర్లు ఉండడంతో అభిమానులు ఎంతో ఆనందంలో మునిగిపోయారు.నాటు నాటు.. ఒరిజిన‌ల్ మ్యూజిక్ కేట‌గిరీలో ఆస్కార్ ని గెలుచుకుంది. ఈ పాట‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీప్రియుల‌ను ఉర్రూత‌లూగించింది. ప్ర‌పంచ దేశాల్లో ఎంద‌రో ఈ పాట‌కు క‌నెక్ట‌యి డ్యాన్సులు చేసారు. అలా చేయ‌గ‌లిగిన ఘ‌న‌త కీర‌వాణి- చంద్ర‌బోస్ లకే సొంతమని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది.