భువనగిరిలోని ముదిరాజ్ వాడ అంగన్వాడి కేంద్రంలో 22 ఆగ‌స్టు 2024న పాడైపోయిన గుడ్డు స‌ర‌ఫ‌రా అయ్యింద‌న్న వార్త‌ తెలిసిన వెంట‌నే.. అదే రోజు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌కు చెందిన జిల్లా సంక్షేమ అధికారిణి విచార‌ణ చేప‌ట్టి సెక్టార్ సూప‌ర్ వైజ‌ర్, టీచ‌ర్, హెల్ప‌ర్ తో పాటు కోడిగుడ్ల కాంట్రాక్ట‌ర్ కు మోమో జారి చేసారు. పాడైన‌పోయిన గుడ్డు స‌ర‌ఫ‌రాపై సంజాయిషీ కోరారు. పాడైపోయిన గుడ్డును ఇచ్చినందుకు మీపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని వివ‌ర‌ణ కోరారు. కోడిగుడ్ల స‌ర‌ఫరా కాంట్రాక్ట్ ను ఎందుకు ర‌ద్దు చేయ‌కూడ‌ద‌ని కాంట్రాక్ట‌ర్ కు మోమో జారి చేసారు. ఆ మ‌రుస‌టి రోజు అంటే 23 ఆగ‌స్టు 2024న సెక్టార్ సూపర్వైజర్ ఆర్. నర్మద, టీచర్ స్వరూపారాణి, హెల్ప‌ర్అరుణ లు లిఖిత పూర్వ‌క వివ‌ర‌ణ‌ ఇచ్చారు.

అయితే వారి వివ‌ర‌ణ సంతృప్తిక‌రంగా లేక‌పోవ‌డంతో, భాద్యుల‌ను స‌స్పెండ్ చేసేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌క్రియ‌ను 24 గంట‌ల్లోపే జిల్లా అధికారులు ప్రారంభించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌రెక్క‌డా జ‌ర‌క్కుండా అంగ‌న్ వాడీ సెక్టార్ సూప‌ర్ వైజ‌ర్ల‌కు కీల‌క ఆదేశాలు జారి చేసారు. ప్రతి నెల సెక్టార్ల‌ వారీగా అంగ‌న్ వాడీ టీచర్లను స‌మావేశ ప‌రిచి సూచనలు చేసిన‌ట్లు గానే..ఇకనుంచి హెల్ప‌ర్ల‌కు సైతం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి విధి నిర్వహణపై ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని ఆదేశించారు. 

ఘ‌ట‌న జ‌రిగిన 24 గంట‌ల్లోపే శాఖ ప‌రమైన విచార‌ణ పూర్తి చేసి, భాద్యుల‌పై చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం సిద్ద‌ప‌డ‌గా... అవేవీ ప‌ట్ట‌కుండా నాలుగు రోజుల ఆల‌స్యంగా మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయ‌డం ఆయ‌న‌ భాద్య‌తా రాహిత్యానికి నిదర్శ‌నమని మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీత‌క్క పేర్కొన్నారు. గ‌త ప్ర‌భుత్వ హాయంలో అంగ‌న్ వాడీ కేంద్రాల్లో పాడైపోయిన గుడ్ల‌కు సంబంధించి ఎన్నో ఘ‌ట‌న‌లు వెలుగు చూసినా..గ‌త ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని మంత్రి గుర్తు చేసారు. అంగ‌న్ వాడీ కేంద్రాలకు ప్ర‌తి రోజు 18 ల‌క్ష‌ల‌కు పైగా గుడ్లు స‌ర‌ఫ‌రా అవుతున్నాయ‌ని..ఎక్క‌డా ఏ చిన్న స‌మ‌స్య త‌లెత్త‌కుండా ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ఎక్క‌డ పొర‌పాట్లు జ‌రిగినా తక్ష‌ణం స్పందించి త‌గు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు మంత్రి సీత‌క్క వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా విధుల్లో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించిన సిబ్బందిపై, నాసి రకం గుడ్లు స‌ప్లై చేసిన కాంట్రాక్ట‌ర్ల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని మంత్రి మ‌రో సారి హెచ్చ‌రించారు.