తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా, ఎనుముల రాజ్యాంగం నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై ఇప్పటివరకు సుమారు 5 వేల కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు.
ఒక టీవీ ఛానల్ కార్యాలయంపై జరిగిన ఘటనలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ భార్యను ఏ25గా చేర్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులు స్టేషన్కు రావాలంటూ ఆమెను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు చేశారాయన. ఇది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను ప్రభుత్వానికి ఉద్దేశించి విసిరారు.
ప్రశ్నించాలన్నా, నిరసన తెలపాలన్నా ఇప్పుడు రాష్ట్రంలో ఆ హక్కులు పోయినట్టుగా ఉన్నాయన్న ఆవేదనను శ్రవణ్ వ్యక్తం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి పని ఉందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు హోంశాఖపై సీఎం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పెనుసవాలుగా మారుతున్న తరుణంలో రేవంత్కు ఆ బాధ్యతలు నెరవేర్చలేనిచో హోంశాఖను మరొకరికి అప్పగించాలని సూచించారు. సిట్ పేరుతో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్ లా వ్యవహారాలు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు.
దాసోజు శ్రవణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.




