ములుగు మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి సన్మాన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ తరపున గెలిచిన కౌన్సిలర్లందరినీ శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి సీతక్క ప్రసంగించారు.ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రతి కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి మున్సిపల్ చైర్పర్సన్గా చింతనిప్పుల చంద్రకళ బిక్షపతిని ఎన్నుకున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ చైర్పర్సన్ కావాలనే ఆశ ఉంటుంది కానీ అవకాశం ఒక్కరికి మాత్రమే దక్కుతుందని స్పష్టం చేశారు.
సీనియర్ అనుభవం కలిగిన నాయకుడిగా, ములుగు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్న చింతనిప్పుల బిక్షపతికి ఈ అవకాశం కల్పించామని తెలిపారు. గతంలో ఎన్నో ఒత్తిడులు వచ్చినప్పటికీ పార్టీ మారకుండా నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. ఆయనలో చిత్తశుద్ధి, కమిట్మెంట్ ఉన్నాయని, పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ములుగు మున్సిపాలిటీ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు బిక్షపతి అని అన్నారు.అవకాశం రానివారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో మంచి అవకాశాలు అందరికీ వస్తాయని భరోసా ఇచ్చారు. తనకు ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు—అందరూ సమానమని మంత్రి స్పష్టం చేశారు.ములుగు మున్సిపాలిటీలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడానికి వెన్నుపోటు రాజకీయాలే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరమని, అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. ఎవరు వెన్నుపోటు రాజకీయాలు చేశారో తమకు తెలుసని, పద్ధతి మార్చుకోవాలని ఇది చివరి హెచ్చరిక అని అన్నారు.
ములుగు జిల్లా మాజీ అధ్యక్షుడు నల్లెల కుమార్ను అన్నలాంటివారని పేర్కొంటూ, ఆయన కుమారుడు నల్లెల భరత్కు ఇంకా వయసు ఉందని, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు.తమను ఓడించేందుకు రియల్ ఎస్టేట్ మాఫియా కోట్లు కుమ్మరించినప్పటికీ ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అన్ని అంశాలను ఆలోచించి, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా బిక్షపతికి అవకాశం ఇచ్చామని తెలిపారు. అన్ని ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే విజయం ఖాయం అని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.




