తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డితో పాటు కమిషన్ సభ్యులు. ఈ సందర్భంగా కమిషన్ ఏర్పడిన మొదటి మూడు నెలల కాలంలో చేపట్టిన పనులపై సమగ్ర నివేదికను మంత్రి సీతక్కకు సమర్పించారు.
నివేదికలో బాలల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన అనేక కీలక కార్యక్రమాలు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు, యూనిసెఫ్ సహకారంతో నిర్వహించిన శిక్షణలు, స్వచ్ఛంద సంస్థలతో సంప్రదింపులు, ప్రచార కార్యక్రమాలు, శిశు విహార్ సందర్శనలు, ఇందిరా మహిళా శక్తి మిషన్ వర్క్షాప్, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీ పిల్లల కోసం ‘భరోసా’ కార్యక్రమాలు, బాల్యవివాహాల నివారణకు అవగాహన కార్యక్రమాలు, బాల అదాలత్లు, బాల మేళాలు, ‘అమ్మ మాట – అంగన్వాడి బాట’ కార్యక్రమాలు, చార్మినార్లో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమం, అంగన్వాడి కేంద్రాల సందర్శనల వంటి అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కమిషన్ యొక్క కృషిని మంత్రి సీతక్క అభినందించారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం మరింత విస్తృతంగా, సమర్థవంతంగా పని చేయాలని ఆమె సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మరింత ప్రభావవంతమైన చర్యలు చేపట్టాలన్నది మంత్రిగారి అభిప్రాయం.
ఈ సమావేశంలో బాలల సంక్షేమంపై చర్చలు జరిగి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత లభించిందని కమిషన్ సభ్యులు తెలిపారు.




