బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మెదక్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా అందరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను గెలిపించడం తన బాధ్యతగా భావిస్తున్నానని స్పష్టంగా చెప్పారు.రామచందర్ రావు మాట్లాడుతూ, మెదక్ జిల్లా రైతులు మంజీర, సింగూర్ ప్రాజెక్టుల నీటిపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో వ్యవసాయానికి వినియోగించడంలో విఫలమైందని విమర్శించారు. ఇది కాంగ్రెస్ పాలనలో రైతుల పట్ల నిర్లక్ష్యం ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తుందని వ్యాఖ్యానించారు.
బీసీల హక్కులను పరిరక్షించడంలో బీజేపీనే ముందున్న పార్టీ అని, బీసీ కమిషన్ను తీసుకొచ్చింది బీజేపీ అని తెలిపారు. శాసనసభ, లోక్సభల్లో బీజేపీ నుండి గెలిచే ప్రజా ప్రతినిధుల్లో బీసీల శాతమే ఎక్కువ అని ఆయన వివరించారు. నరేంద్ర మోదీ వంటి బీసీ నాయకుడిని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీదే అని గుర్తుచేశారు.
“బీసీలకు నిజమైన గౌరవం ఇస్తున్నది బీజేపీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక బీసీని ముఖ్యమంత్రిగా చేసేందుకు సిద్ధమా? తన పదవికి రాజీనామా చేయగలడా?” అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.ఈ సమావేశంలో రామచందర్ రావు కార్యకర్తలకు ధైర్యం నూరిపోసారు. బీజేపీ త్వరలోనే తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టంచేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం – రామచందర్ రావు




