బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మంగళవారం వివరాలను వెల్లడించారు.
పశ్చిమమధ్య మరియు వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని, ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనించే సూచనలు ఉన్నాయని జైన్ తెలిపారు.
ఈ అల్పపీడనం కారణంగా కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ సూచించింది.




