ప్రముఖ మానసిక నిపుణుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నోటిస్ట్ డా. బీవీ పట్టాభిరామ్ (75) ఇకలేరు. ఆదివారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మానసిక వైద్య రంగం, విద్యా వర్గాలు, శిష్య వర్గం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.
సుదీర్ఘకాలంగా వ్యక్తిత్వ వికాస శిక్షణలతో అనేక జీవితాలను ప్రభావితం చేసిన డా. పట్టాభిరామ్, 1991లో ‘ప్రశాంతి కౌన్సెలింగ్ & హెచ్ఆర్డీ సెంటర్’ స్థాపించారు. మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఒత్తిడి నిర్వహణ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆయన పాత్ర అపూర్వం.
పట్టాభిరామ్ తన విద్యార్థి దశ నుంచే మానవ మనస్సు మీద ఆసక్తితో సైకాలజీ, తత్వశాస్త్రాల్లో పీజీ పూర్తి చేసి, ఆ తర్వాత హిప్నోటిజం పై ప్రత్యేక శిక్షణ పొందారు. ఆయన ప్రసంగాలు, సదస్సులు, రచనలు తెలుగులో మానసిక వైద్యం, వ్యక్తిత్వ వికాసానికి ఓ నవదిగంతం తెచ్చాయి.
యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా కూడా ఆయన లక్షల మందిని చేరుకున్నారు. నాలుగు కోట్లకుపైగా వీక్షణలతో, దాదాపు 5 లక్షల మంది చందాదారులతో ఆయన చానెల్ ఎంతో ప్రజాదరణ పొందింది.
అంత్యక్రియలు బుధవారం
డా. పట్టాభిరామ్ పార్థివదేహాన్ని ఖైరతాబాద్లోని నివాసంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబిలీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
ఆయన మృతి మానసిక ఆరోగ్య సేవల రంగానికి తీరని లోటుగా నిలుస్తుందంటూ పలువురు ప్రముఖులు, శిష్యులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.




