GHMC స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో మీడియా ప్రతినిధుల ప్రవేశాన్ని నిరోధించాలనే యోచన అధికార కాంగ్రెస్ మేయర్ నుంచి రావడం గమనార్హమని, ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది.
ఈ అంశంపై మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఊరపల్లి స్పందిస్తూ, “ఇది నిజమైతే ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్య. గతంలో బార్సాలో ఉన్నప్పుడు కూడా ఇదే మేయర్ మీడియా ప్రవేశాన్ని నిషేధించినప్పుడు మేమే ముందుగా ఎదురు తిరిగాం. ఇప్పుడు అదే ధోరణిని పునరావృతం చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది” అని వ్యాఖ్యానించారు.
అలాగే, GHMC చట్టం ప్రకారం ప్రతి సమావేశం ప్రజలకు ఓపెన్గా ఉండాలని స్పష్టం చేస్తూ, “ప్రజాధనంతో నడిచే GHMC వ్యవహారాలు ప్రజలకే స్పష్టంగా కనిపించాల్సిన అవసరం ఉంది. అటువంటి సంస్థలో మీడియా ప్రవేశంపై ఆంక్షలు ఎవరికి? ఎందుకు? ఏమి దాచాలని చూస్తున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.
శ్రవణ్ ఊరపల్లి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, “మేయర్ దొంగల చేతిలో కీలు బొమ్మగా మారిపోతున్నారని అనిపిస్తోంది. పార్టీలు మారినా, మేయర్ కార్యాలయ ధోరణి మాత్రం మారలేదు. ఇదంతా ఎవరి అండదండలతో జరుగుతోందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి,” అని మండిపడ్డారు.
ఇటీవల జరిగిన డీసీ బదిలీలలో సైతం భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ, “సొమ్ము ముట్టచెపితే మంచి పోస్టింగ్, లేకపోతే చెత్త పోస్టింగ్. అధికారుల పనితీరు ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదు” అని విమర్శించారు.
ఈ అంశాలపై త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని, పట్టించుకోకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. “మీ ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పకపోతే… ఖబర్దార్!” అని శ్రవణ్ ఊరపల్లి ఉగ్ర హెచ్చరిక చేశారు.




