మల్కాజ్గిరి డివిజన్లో బోనాల వేడుకలను పురస్కరించుకుని, ఆలయాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను కార్పొరేటర్ శ్రవణ్, నూతన డిప్యూటీ కమిషనర్ సుల్తానా కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓల్డ్ మల్కాజ్గిరిలోని పలు దేవాలయాలను సందర్శించి, అధికారులతో సమీక్ష జరిపారు.
ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థపై శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అక్కడ డ్రైనేజీ పొంగుతున్న విషయాన్ని వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటర్ వర్క్స్ అధికారుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
అదే విధంగా మూడు గుళ్ళు దేవాలయం వద్ద ప్యాచ్ వర్క్ చేసి మధ్యలో ఆపివేసిన విషయాన్ని కూడా అధికారులను ప్రశ్నించారు. తిరిగి వెంటనే పనులు పూర్తి చేయాలని, భక్తుల భద్రత దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్శనలో డీసీ సుల్తానా, AMOH మంజుల, వాటర్ వర్క్స్ జీఎం సునీల్, మేనేజర్ తేజస్విని, నవీన్, నాగార్జున తదితర అధికారులు పాల్గొన్నారు.




