
అయోధ్య రామ మందిర ట్రస్ట్ సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. 5,000 మందికి పైగా అభ్యర్థుల నుంచి జితేంద్ర మిశ్రాను ఈ పదవికి ఎంపిక చేశారు. భారత వాయుసేనలో జితేంద్ర మిశ్రా కీలక బాధ్యతలు నిర్వహించారు. పలు కమాండింగ్ హోదాల్లో పనిచేసిన ఆయన.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వాయుసేన పశ్చిమ కమాండ్ చీఫ్గా వ్యవహరించారు. ఆలయ విరాళాల అవకతవకల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఈ నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బుధవారం అయోధ్యలో రామ మందిర ట్రస్ట్ సమావేశం అనంతరం జితేంద్ర మిశ్రా నియామకాన్ని ప్రకటించారు. ఆలయ విరాళాల నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేయగా.. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాల మధ్య జరిగిన సమావేశంలో ఖాళీగా ఉన్న మూడు ట్రస్టీ పదవులను భర్తీ చేసే అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్, స్వామి కమలనయన్ దాస్, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ మోహన్, ట్రస్టీ మహంత్ దినేంద్ర దాస్, కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ట్రస్ట్ మతపరమైన వ్యవహారాల కమిటీలో సభ్యుడైన స్వామి కమలనయన్ దాస్.. ఆలయ నిర్వహణ సజావుగా సాగడం తమ ప్రధాన ప్రాధాన్యత అని సమావేశానికి ముందు తెలిపారు. ట్రస్ట్ డీడ్లో సవరణలు, అధికారిక మీడియా ప్రతినిధి నియామకం, ఇతర పరిపాలనా అంశాలపైనా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ట్రస్ట్ అధ్యక్షుడి నివాసంలో ఈ సమావేశం జరిగింది.
ఏఐతో సీఈవో ఎంపిక ప్రక్రియ
జితేంద్ర మిశ్రా ఎంపిక ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్క్రీనింగ్తో పాటు మాన్యువల్ పరిశీలనను కూడా ఉపయోగించారు. మొత్తం 600 మార్కులతో అభ్యర్థుల మూల్యాంకన విధానాన్ని రూపొందించారు. ప్రారంభ దశలో 3,577 మంది అభ్యర్థులు ఈ అసెస్మెంట్లో పాల్గొన్నారు. 470 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేశారు. అనంతరం 108 మందితో వర్చువల్ ఇంటరాక్షన్స్ నిర్వహించారు. చివరగా 16 మంది అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి.. ఆగస్టు 11, 12 తేదీల్లో అయోధ్యలో వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరిలో ముగ్గురిని తుది జాబితాకు ఎంపిక చేయగా.. జితేంద్ర మిశ్రాను తొలి పూర్తికాలిక సీఈవోగా నియమించారు.
సీఈవో అధికారాలు, బాధ్యతలను స్పష్టంగా నిర్వచించే అంశాన్ని కూడా సమావేశంలో పరిశీలించినట్లు తెలుస్తోంది. కొత్త పరిపాలనా వ్యవస్థను అధికారికంగా అమల్లోకి తీసుకురావడం, ట్రస్ట్లోని వివిధ కమిటీల మధ్య సమన్వయాన్ని మరింత సులభతరం చేయడం వంటి అంశాలు కూడా ప్రతిపాదిత సవరణల్లో ఉండనున్నాయి. అలాగే ట్రస్ట్కు సంబంధించిన ఆర్థిక, పరిపాలనా వ్యవహారాలపై కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా ఆలయ విరాళాల కేసు నేపథ్యంలో తలెత్తిన అంశాలు, స్థానిక అధికారులతో కలిసి ఆలయ భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేయడం వంటి విషయాలు సమావేశం ఎజెండాలో ఉన్నాయి.




