దుబాయ్లో ఐపీఎల్ కోసం ఒక్క చెన్నై టీం తప్ప మిగిలిన జట్లన్నీ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. చాలా వరకు ఇండియన్ ప్లేయర్లు తమ తమ జట్లతో చేరారు. పలువురు విదేశీ ఆటగాళ్లు రానున్న రోజుల్లో జట్లతో చేరనున్నారు. కాగా డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ జట్టు గత వారం కిందట యూఏఈలో ల్యాండ్ అయింది. క్వారంటైన్ ముగించుకుని ఆ జట్టు ప్లేయర్లు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. కోచ్ మహేళ జయవర్దనె పర్యవేక్షణలో వారు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్ యాజమాన్యం తాజాగా తమ జట్టు ఆటగాళ్లు ధరించనున్న కొత్త జెర్సీలను విడుదల చేసింది.
బ్లూ, గోల్డ్ కలర్లో ఉన్న జెర్సీలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తాజాగా ఆవిష్కరించింది.
ఈ మేరకు ఆ జట్టు వాటికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ జెర్సీలను కొనుగోలు చేసేందుకు లింక్ను కూడా అందులో ఇచ్చింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు జెర్సీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా ముంబై జట్టు ఇప్పటికే నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీని సాధించింది. 2013 ఐపీఎల్ సీజన్ మధ్యలో రికీ పాంటింగ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ తమ మొదటి ఐపీఎల్ టైటిల్ను సాధించింది. తరువాత 2015, 2017, 2019లలోనూ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది. దీంతో ఈసారి ఆ జట్టు డిఫెండింగ్ చాంపియన్స్గా బరిలోకి దిగుతోంది.