తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు వచ్చిన ఓ ఫోన్కాల్ కలకలం సృష్టించింది. చెన్నై పోయిస్ గార్డెన్ ప్రాంతంలోని రజినీకాంత్ ఇంట్లో బాంబు పెట్టారని గురువారం 108 నంబర్కు ఓ అజ్ఞాత ఫోన్కాల్ వచ్చింది. కంట్రోల్ రూం ద్వారా అప్రమత్తమైన పోలీసులు.. బాంబు నిర్వీర్య దళంతో కలిసి రజినీకాంత్ ఇంటి వద్దకు చేరుకున్నారు.
అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలీసులు ఇంట్లోకి వచ్చి తనిఖీలు చేపట్టేందుకు కుటుంబసభ్యులు అనుమతివ్వలేదు. దీంతో వారు ఇంటి ఆవరణతోపాటు పరిసరాలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో.. నకిలీ కాల్గా తేల్చారు. ఫోన్కాల్ ఎక్కడినుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.