దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం విదితమే. ఈ కరోనా వైరస్ జర్నలిస్టులకు కూడా వ్యాపించింది. ఇందులో తెలుగు జర్నలిస్టులు కూడా ఉన్నారు. దీంతో ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టుల పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కొందరు జర్నలిస్టులు కరోనా బారిన పడటంతో అవసరమైన సాయం చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టుల కోసం రూ. 12 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కొందరు ఢిల్లీ జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ తేలడంతో ప్రభుత్యం చర్యలు ప్రారంభించింది. తక్షణ సాయం కింద రూ. 75 వేల నగదు విడుదల చేసింది. ఢిల్లీలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పర్యవేక్షిస్తున్నారు.