రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. శాసనసభ సమావేశాల నిర్వహణ సహా ఇతర అంశాలపై కేబినెట్ భేటీలో చర్చిస్తారు. ఈ మధ్యాహ్నం ప్రగతి భవన్ వేదికగా జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు, మంత్రి మహమూద్ అలీ, ఉన్నతాధికారులు పాల్గొంటారు. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యాక జరుగుతున్న మొదటి మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మొదటి అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. కేబినెట్లో అధికారికంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 19న ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ఇతర అంశాలకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అటు పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం కోసం ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అటు ఆంగ్లో ఇండియన్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్ సన్కు మళ్లీ అవకాశం ఇవ్వనున్నారు.
ఈ మేరకు ఇవాల్టి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెరాస మొదటి దఫాలోనూ స్టీఫెన్సన్ నామినేటెడ్ శాసనసభ్యుడిగా ఉన్నారు.