కొత్త రాజకీయ పార్టీ పెట్టాలా? సంపూర్ణ మద్దతు తెలిపిన లోక్సత్తాతో కలిసి వెళ్ళాలా అనే విషయంలో అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని ఐపిఎస్ మాజీ అధికారి వివి లక్ష్మినారాయణ చెప్పారు. నూతన ఒరవడితో రాజకీయ అరంగేట్రం చేస్తామని చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎపిలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. రాజకీయ ఎజెండా, విధివిధానాలపై చర్చించేందుకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో తన మద్దతుదారులతో లక్ష్మినారాయణ సోమవారం సమావేశమయ్యారు. లోక్సత్తా వ్యవస్థాపకులు జయ్రపకాశ్ నారాయణ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎపి కన్వీనర్ పోతిన వెంకట రామారావు, తెలంగాణ ప్రజాపార్టీ అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్, పలువురు మేధావులు లక్ష్మినారాయణకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భావసారూప్యం ఉన్న వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని తిరుపతిలో తాను చేసిన ప్రకటన తర్వాత చాలా పార్టీలు తనను ఆహ్వానించాయి కానీ ఏ పార్టీ విధివిధానాలపై స్పందించలేదన్నారు. అయితే ఇప్పుడు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయ్రపకాశ్ నారాయణ లోక్సత్తా పగ్గాలు చేపట్టాల్సిందిగా బహిరంగంగా ప్రకటించారని అన్నారు. కోర్ కమిటీలో చర్చించి అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.
తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలపాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్దితో పనిచేసే వ్యక్తులకే తమ మద్దతు ఉంటుందని చెప్పారు. తెలంగాణలో జరిగే ఎంపీ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని స్పష్టంచేశారు. ఎపిలో నూతన రాజకీయ ఒరవడి అత్యవసరమని లక్ష్మినారాయణ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై దాడి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని లక్ష్మినారాయణ స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రజల మాన ప్రాణాలు, ఆస్తులు కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. ప్రజా సమస్యలు కనుమరుగయ్యే వరకు రాజకీయాల్లో ఉంటానని, వెనక్కితగ్గే ప్రసక్తే లేదన్నారు. ప్రధాని మోడీ వదిలిన బాణం లక్ష్మినారాయణ అని ప్రచారం జరుగుతుందన్న ప్రశ్నకు బదులిస్తూ, తాను బాణం కాదు.. ధనస్సునని చెప్పారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని అభిప్రాయపడ్డారు.
లోక్సత్తా పగ్గాలు చేపట్టండి – జయప్రకాశ్ నారాయణ
లోక్సత్తా పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ లక్ష్మినారా యణను కోరారు. పార్టీలో నాయకులందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వివి తీసుకు న్న రాజకీయ నిర్ణయానికి జెపి సంపూర్ణ మద్దతు ప్రకటిం చారు. తెలంగాణ ప్రజా పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకు మార్ కూడా మద్దతు తెలిపారు. ఆప్ ఎపి కన్వీనర్ పోతిన వెంకటరామారావు, యువజన విభాగం నాయకులు ముసు నూరు వినోద్,పవన్లు వివికి సంఘీభావం తెలిపారు. శ్రామిక వికాసం నాయకులు యజ్ఞనారాయణ, పలువురు ప్రొఫెసర్లు, వివిధ వర్గాల ప్రజలు లక్ష్మినారాయణకు మద్దతు తెలిపారు.