ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా దుష్టపాలన సాగిస్తుంటే ప్రశ్నించని ఏపీ ప్రతిపక్షాలు తెదేపా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. భాజపా పాలనకు చరమగీతం పాడేందుకే ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, ములాయం సింగ్ లాంటి సీనియర్ నేతలతోనూ, కాంగ్రెస్తోనూ కలసి పనిచేసేందుకు ప్రయత్నిస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. మోదీ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్తో కలిసి నడవాలని చంద్రబాబు ఓ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడల్లా తెలుగు దేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిందని దేవినేని గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా ఈ ప్రయత్నాలకు మంచి స్పందన వస్తోందన్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. ఆర్థికంగా కష్టాలున్నా పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. నిధులివ్వని కేంద్రాన్ని ప్రశ్నించకుండా భాజపాతో పవన్, జగన్ పార్టీలు అంటకాగుతున్నాయని ఆరోపించారు. తెదేపాను దెబ్బతీయడానికే వైకాపా, జనసేన, భాజపా ఏకమ్యయాయని విమర్శించారు. ఈ కుట్రలను తిప్పి కొడతామన్నారు. తెలుగుజాతి హక్కులను కాపాడుకునేందుకు తెదేపా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. సముద్రంలోకి వృథాగా వెళ్లాల్సిన 246 టీఎంసీల నీటిని ఒక నదీ ప్రవాహ ప్రాంతం నుంచి మరో నదీ ప్రవాహ ప్రాంతానికి తరలించిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని మంత్రి వ్యాఖ్యానించారు.