శ్రీరాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు.అనుమతి లేకుండా నగరంలో ప్రవేశించొద్దని.. తమ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో జూబ్లీహిల్స్ గృహనిర్బంధంలో ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.నాలుగు వాహనాల్లో బయలు దేరిన తెలంగాణ పోలీసులు స్వామి పరిపూర్ణాంద తరలింపులో చాకచక్యం ప్రదర్శించారు. రెండు వాహనాలను విజయవాడ వైపు, మరో రెండు వాహనాలను శ్రీశైలం వైపు పంపించారు. ఈ రెండు మార్గాల్లో ఆయన్ను ఎక్కడికి తరలించారనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. అయితే స్వామి పరిపూర్ణాందను కాకినాడ తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.