కొన్ని నెలలుగా సీఎం కుమారుడు నారాలోకేష్పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణల తీవ్రత చూసిన తర్వాత చంద్రబాబు-పవన్ ఇక కలిసే ప్రసక్తే ఉండదని భావించారు. కానీ కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని రమేష్…. తన ఎస్టేట్లో నిర్మించిన దశావతారమూర్తి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా తిరిగి ఇద్దరూ కలిసిపోయారు.
విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరినీ లింగమనేని రమేష్ ఆహ్వానించారు. చంద్రబాబు, పవన్ పక్కపక్కనే నడుచుకుంటూ ఆలయంలోకి వచ్చారు. పూజలు చేశారు. కానీ బయట ఒకరినొకరు పలకరించుకోలేదు. దీంతో చంద్రబాబు, పవన్ ఎదురుపడ్డా మాట్లాడుకోలేదని మీడియా చానళ్లు ప్రసారం చేశాయి.
కానీ ఆలయంలోనే నిర్మించిన ఒక ఏసీ గదిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయిన అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ భేటీ సమయంలో మీడియాను, నేతలను దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్తపడ్డారు. దాదాపు అరగంట పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రహస్యంగా చర్చించుకున్నారు.
ఈ భేటీకి సూత్రధారి లింగమనేని రమేషేనని చెబుతున్నారు. ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రముఖంగా చంద్రబాబు, పవన్ భేటీపై కథనాన్ని ప్రచురించింది. పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న పవన్ కల్యాణ్…. ఇలా రహస్యంగా భేటీ కావడం చర్చనీయాంశమైంది.