మోడీ మళ్ళీ ప్రధాని కాలేరని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. కర్ణాటకలో కూడా బీజేపీ అధికారంలోకి రాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ద వైర్ అనే వెబ్సైట్కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినందున కొన్ని ప్రకటనలు తనకు రాకుండా అధికార పక్షం అడ్డుకుందని, అలాగే కొన్ని హిందీ సినిమా అవకాశాలు కూడా పోయాయని ప్రకాష్ రాజ్ అన్నారు. దాని వల్ల తనకు వచ్చే నష్టమేమీ లేదని.. ఆ మాత్రం నష్టాన్ని భరించే ఆర్థిక స్తోమత తనకు ఉందని అన్నారు.
అయితే బీజేపీ భక్తులు తన దక్షిణాది సినిమాల జోలికి రాలేరని అన్నారు. దమ్ముంటే వచ్చి ఆపాలని సవాల్ విసిరారు. దక్షిణ కర్ణాటక, ఉడిపి ప్రాంతాల్లో మతం ఆధారిత రాజకీయాలతో ప్రవేశించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని…. అయిదేళ్ళ క్రితం అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ ఏం చేసిందో జనం మరోసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన కోరారు. బీజేపీ నేతృత్వంలో ముగ్గురు సీఎంలు మారారని, అనేక అవినీతి ఆరోపణలకు అప్పటి ప్రభుత్వం ఎదుర్కొందని వెల్లడించారు. అయితే సిద్ధరామయ్య ప్రభుత్వం ఒకింతకు బాగానే పనిచేస్తోందన్నారు. ఆయన ఏమీ చేయలేదని అనే పరిస్థితి లేదన్నారు. అయినా ప్రజలదే తుదినిర్ణయమని ప్రకాష్ రాజ్ వివరించారు